ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. దేశ వ్యాప్తంగా ఈడీ సోదాలు

Delhi Excise Scam ED raids 30 locations across India.ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈడీ ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2022 5:28 AM GMT
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. దేశ వ్యాప్తంగా ఈడీ సోదాలు

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది. దేశ వ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ఈడీ ఏక కాలంలో దాడులు చేప‌ట్టింది. ఢిల్లీ, లక్నో, గురుగావ్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ న‌గ‌రాల్లో ఈరోజు ఉద‌యం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇక హైద‌రాబాద్‌లో ఆరుచోట్ల ఈడీ దాడులు జ‌రుగుతున్నాయి. వ్యాపారవేత్త రామచంద్రన్‌పిళ్లైతో సహా మరో అయిదుగురికి సంబంధించిన కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాబిన్‌ డిస్టిలర్స్‌ పేరుతో బెంగళూరు, హైదరాబాద్ న‌గ‌రాల్లో రామచంద్రన్‌ పిళ్లై వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయ‌న‌కు చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు ఇంట్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. రామచంద్రన్‌తో పాటు బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృ జన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై సోదాలు జరుగుతున్నాయి.

సోదాల విష‌యాన్ని ఈడీ ప్ర‌ధాన కార్యాల‌యం అధికారికంగా తెలియ‌జేసింది. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి సిసోడియా ఇంట్లో సోదాలు జ‌ర‌గ‌డం లేద‌ని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ అర‌వ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవ‌ల ఈడీ సోదాలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయ‌ని, టెండ‌ర్ల జారీ త‌రువాత మ‌ద్యం లైసెన్సుదారుల‌కు అనుచిత ల‌బ్ధి చేక్చూర్చేలా త‌యారు చేశార‌ని, సీబీఐ విచార‌ణ‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సిఫార్సు చేసిన సంగ‌తి తెలిసిందే.

Next Story