నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం..!
రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది.
By - Medi Samrat |
నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం..!
రాజధాని ఢిల్లీలో జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలించింది. ఢిల్లీలోని జనక్పురిలో వాటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఒక బైక్ రైడర్ గుంతలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత పోలీసులు సంఘటన స్థలంలో మోహరించారు. గొయ్యి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే మృతుడి స్నేహితుడు.. "ఇది ముందే ఎందుకు చేయలేకపోయారు? నా స్నేహితుడిని రక్షించి ఉండేవాడిని.." అని ప్రశ్నించాడు.
ఇటీవల నోయిడాలోని సెక్టార్ 150లోని బేస్మెంట్ గుంతలో ఇంజనీర్ యువరాజ్ మెహతా మునిగి మరణించారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. అయినప్పటికీ ఢిల్లీ జలమండలి మాత్రం ఆందోళన చెందలేదు. ఢిల్లీ వాటర్ బోర్డు జనక్పురిలో ఒక గొయ్యి తవ్వి అలాగే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం కారణంగా ఓ ఇల్లు చిన్న కొడుకును కోల్పోయింది.
నివేదికల ప్రకారం.. కమల్ అనే యువకుడు గురువారం రాత్రి రోహిణిలోని తన కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతడు తన కుటుంబంతో మాములుగానే టచ్లోనే ఉంటాడు. కానీ అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి తిరిగి రాలేదు. అతని కుటుంబ సభ్యులు రాత్రంతా అతని కోసం వెతికారు కానీ అతని జాడ దొరకలేదు.
మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రకారం.. విస్తృతంగా గాలింపులు జరిపినప్పటికీ కమల్ జాడ కనిపించలేదు. ఆ తర్వాత ఆ కుటుంబం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నారు. కానీ పోలీసులు ఉదయం 11 గంటలకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
మృతుడి స్నేహితుడు చెప్పిన ప్రకారం.. "నా స్నేహితుడిని గుర్తించడంలో పోలీసులు మాకు సహాయం చేశారు. 200 మీటర్ల పరిధిలో వెతకమని మమ్మల్ని కోరారు. కుటుంబ సభ్యులు, ఇతరులతో సహా ఏడుగురు వ్యక్తులు అర్ధరాత్రి నుండి ఉదయం 7 గంటల వరకు అతని కోసం వెతికారు, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. మేము ఉదయం ఏడు గంటలకు ఇంటికి చేరుకున్నాం. మా స్నేహితుడి ఫోన్ నుండి మాకు కాల్ వచ్చింది. అతడు గుంటలో ఉన్నాడని పోలీసులు మాకు చెప్పారు. రాత్రిపూట పోలీసులకు అతని ఫోన్ ఎందుకు దొరకలేదు? అతడిని ఎవరైనా చంపారేమోనని మేము అనుమానిస్తున్నాము. అతనికి ఏమి జరిగి ఉండవచ్చు?.. మృతుడి తల్లికి ఈ సంఘటన గురించి ఇంకా సమాచారం అందలేదు. అతని వయస్సు 25 సంవత్సరాలు. రోహిణి సెక్టార్ 10లోని HDFC బ్యాంక్ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడని వివరాలు వెల్లడించాడు. సంఘటనా స్థలానికి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు మోహరించారు.. అయితే మృతుడి స్నేహితుడు.. "ఇది ముందే ఎందుకు చేయలేకపోయారు? నా స్నేహితుడు ప్రాణాలతో ఉండేవాడు కదా?" అని అడుగుతున్నాడు.