మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. 24 గంటల్లో 4 మరణాలు, 685 కొత్త కేసులు
గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఆందోళనలను పెంచుతున్నాయి.
By Medi Samrat
గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఆందోళనలను పెంచుతున్నాయి. భారత్లోనూ దీని ప్రమాదం కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ డ్యాష్బోర్డ్లో పంచుకున్న సమాచారం ప్రకారం.. మే 22 న దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 257 కాగా.. 10 రోజుల్లో ఆ కేసులు 3,395కి పెరిగింది. ఒక్క రోజులో అంటే గత 24 గంటల్లో 685 కొత్త యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు నలుగురు మరణించారు.
కేరళలో రోగుల సంఖ్య 1336కి పెరిగింది. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 467 కాగా.. ఢిల్లీలో 375 ఉన్నాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న స్పీడ్ కచ్చితంగా ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. ఈసారి వ్యాప్తి చెందుతున్న వేరియంట్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. ఇది వ్యాప్తి చెందే అంటువ్యాధి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ ఇన్ఫెక్షన్ ఏదైనా ప్రదేశంలో వ్యాప్తి చెందడం ప్రారంభమైతే అక్కడి ప్రజలు వేగంగా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం.. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, కొమొర్బిడిటీలు (ఒకటి కంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు) లేదా గర్భవతిగా ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్తో మరణించే వారిలో ఎక్కువ మంది ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారే అని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది.