పరువు నష్టం కేసులో రాహుల్‌తో స‌హా సీఎం, డీకేకు సమన్లు ​​పంపిన క‌ర్ణాట‌క‌ కోర్టు

Court Issues Summons To Congress Leaders Including Rahul Gandhi And Siddaramaiah In Defamation Case Filed By BJP. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే చేసిన ఒక ప్రకటన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By Medi Samrat  Published on  14 Jun 2023 10:46 AM GMT
పరువు నష్టం కేసులో రాహుల్‌తో స‌హా సీఎం, డీకేకు సమన్లు ​​పంపిన క‌ర్ణాట‌క‌ కోర్టు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే చేసిన ఒక ప్రకటన కారణంగా ఎంపీగా అన‌ర్హ‌త వేటుప‌డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కర్నాటక ఎన్నిక‌ల ప్ర‌చారంలో చేసిన ప్ర‌క‌ట‌న‌ రాహుల్ గాంధీకి మళ్లీ కొత్త‌ కష్టాలను తీసుకొచ్చింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి కర్ణాటక అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నోటీసు పంపారు. రాహుల్‌తో పాటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు కోర్టు నోటీసులు పంపింది.

మాజీ, సిట్టింగ్ ఎంపీలు/ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. జులై 27న స్టేట్‌మెంట్లు నమోదు చేయ‌నుంది. ఐపీసీ సెక్షన్లు 499 (పరువు నష్టం), 500 (పరువు నష్టం కోసం శిక్ష) కింద కోర్టు దీనిని పరిగణలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ మంగళవారం సమన్లు ​​జారీ చేయాలని ఆదేశించింది.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్‌ మే 9న కాంగ్రెస్ నేత‌ల‌పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలతో బీజేపీ పరువు తీస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు ప్రకారం.. మే 5, 2023న ప్రధాన వార్తాపత్రికలలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ద్వారా ప్రకటన జారీ చేయబడింది. రాష్ట్రంలోని గ‌త‌ బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్‌కు పాల్పడుతోందని పేర్కొంది. ఈ విధంగా నాలుగేళ్లలో బీజేపీ రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం చేసిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలు నిరాధారమైనవి, పక్షపాతంతో కూడినవి. పరువు నష్టం కలిగించేవని ఫిర్యాదులో పేర్కొన్నారు.



Next Story