గుజరాత్ నుంచి కాంగ్రెస్ రెండో దశ 'భారత్ జోడో యాత్ర'

Congress to begin second phase of Bharat Jodo Yatra from Gujarat. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతమైతే గుజరాత్‌ నుంచి

By అంజి  Published on  16 Sept 2022 12:17 PM IST
గుజరాత్ నుంచి కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో యాత్ర

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతమైతే గుజరాత్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు మరో యాత్ర చేపడతామని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ నేతలు శుక్రవారం కొల్లాం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారానికి భారత్ జోడో యాత్రకు సంబంధం లేదని జైరాం రమేష్ స్పష్టం చేశారు.

''మేము రెండవ దశలో 150 రోజుల్లో దాదాపు 3,100 కి.మీ పాదయాత్ర చేస్తాం. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని లాంగ్ మార్చ్ ఇదే. ఇంతకుముందు ఇది చైనా నాయకుడు మావో జెడాంగ్ చేపట్టిన యాత్ర లాంటిది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే యాత్ర విజయవంతమైతే గుజరాత్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు సాగే యాత్రతో ముందుకు సాగుతాం'' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ కొల్లాంలో అన్నారు. బీజేపీ ప్రాబల్యం లేని రాష్ట్రాల నుంచి యాత్ర చేపట్టడంపై రాజకీయ పార్టీలు ప్రశ్నించడంతో కాంగ్రెస్ స్పందించింది.

సెప్టెంబరు 15న ఒకరోజు విరామం తర్వాత ఈరోజు యాత్ర పునఃప్రారంభమైంది. కేరళలోని తిరువనంతపురంలోని నవాయిక్కుళం నుంచి ప్రారంభమైన యాత్ర బుధవారంతో ఏడో రోజు పూర్తి చేసుకుంది. ఏడో రోజు రాహుల్ గాంధీ కొల్లాం జిల్లా చత్తన్నూరులో విద్యార్థులతో ముచ్చటించారు. నవాయిక్కుళం నుంచి పాదయాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ కేరళలోని శివగిరి మఠంలో సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురువుకు నివాళులర్పించారు. మతం, వర్గాలకు అతీతంగా భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర స్ఫూర్తి అని, ఇది ఒకటే దేశమని, మనం కలిసికట్టుగా ఉండి పరస్పరం గౌరవంగా ఉంటేనే విజయవంతమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.

Next Story