'అంతగా అభ్యంతరం ఉంటే పాక్‌తో ఆడ‌కుండా ఉండాల్సింది..', నో హ్యాండ్‌షేక్ వివాదంపై శశి థరూర్ వ్యాఖ్య‌లు

ఆసియాకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ తర్వాత వివాదం తలెత్తింది.

By -  Medi Samrat
Published on : 25 Sept 2025 3:08 PM IST

అంతగా అభ్యంతరం ఉంటే పాక్‌తో ఆడ‌కుండా ఉండాల్సింది.., నో హ్యాండ్‌షేక్ వివాదంపై శశి థరూర్ వ్యాఖ్య‌లు

ఆసియాకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ తర్వాత వివాదం తలెత్తింది. పాక్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. కరచాలనం విష‌యంలో ప్రజలకు వారి స్వంత అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తిని రాజకీయాలు, సైనిక వివాదాలకు దూరంగా ఉంచాలని అన్నారు.

భారత్‌-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అతని సహచర బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే కరచాలనం చేయకుండా మైదానాన్ని విడిచిపెట్టారు. ఆ తర్వాత కొత్త చర్చ మొదలైంది.

పాకిస్థాన్‌పై మనకు అంత అభ్యంతరం ఉంటే వారితో ఆడ‌కుండా ఉండాల్సిందని నేను వ్యక్తిగతంగా నమ్ముతానని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కానీ, ఒకసారి ఆడాలనే నిర్ణయం తీసుకున్నాక, క్రీడాస్ఫూర్తితో ఆడి ఆటగాళ్లతో కరచాలనం చేసి ఉండాల్సింది. ఇంతకుముందు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారని థరూర్ చెప్పారు.

1999 కార్గిల్ యుద్ధాన్ని ఉదాహరణగా చూపుతూ.. ఆ సమయంలో కూడా దేశం కోసం సైనికులు వీరమరణం పొందుతున్నప్పుడు.. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో భారతదేశం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడిందని, ఆటగాళ్లు కరచాలనం చేశారని అన్నారు.

భారత్, పాకిస్థాన్‌ల ప్రతిచర్యలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. ముందుగా భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుంటే.. పాక్ జట్టు కూడా రెండోసారి అదే విధంగా స్పందించిందని థరూర్ అన్నారు. ఇది క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించదు. క్రికెట్ మైదానంలో దేశాల మధ్య ఉన్న టెన్షన్‌ను మరిచిపోయి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ అంటున్నారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని దేశం మొత్తంతో ముడిపెట్టడం సరికాదని శశిథరూర్ అన్నారు.

Next Story