ఉద్యోగి కూతురికి అరుదైన వ్యాధి.. రూ.16 కోట్ల సాయం చేసిన కోల్‌ ఇండియా

Coal India Ltd sanctions Rs 16 cr for treatment of 2-year-old suffering from rare disease. తన ఉద్యోగి కుమార్తె అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలుసుకున్న.. ఆ సంస్థ చికిత్స కోసం ఏకంగా రూ.16 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చి మానవతా దృక్పథాన్ని చాటుకుంది.

By అంజి  Published on  18 Nov 2021 1:54 PM GMT
ఉద్యోగి కూతురికి అరుదైన వ్యాధి.. రూ.16 కోట్ల సాయం చేసిన కోల్‌ ఇండియా

తన ఉద్యోగి కుమార్తె అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలుసుకున్న.. ఆ సంస్థ చికిత్స కోసం ఏకంగా రూ.16 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చి మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లో సతీశ్‌ కుమార్‌ రవి అనే వ్యక్తి కోల్‌ ఇండియాకు చెందిన సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ పరిధిలోని దీప్కా కోల్‌ పని చేస్తున్నాడు. ఇతనికి 2019లో కూతురు సృష్టి రాణి జన్మించింది. పాప పుట్టిన 6 నెలల తర్వాత అనారోగ్యం బారిన పడింది. అప్పటికే కరోనా మహమ్మారి విజృంభించడంతో సతీశ్‌ కుమార్‌ దంపతులు స్థానిక డాక్టర్ల వద్ద చికిత్స చేయించారు. అయినప్పటికీ పాప కోలుకోలేదు.

దీంతో 2020 డిసెంబర్‌లో తమిళనాడులోని వెల్లూరులో గల క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాపకు చికిత్స అందించిన డాక్టర్లు, ఆమె స్పైనల్‌ మస్కులర్‌ ఆత్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. ఈ జన్యుపరమైన వ్యాధి సోకిన వారికి బ్రెయిన్‌ స్టెమ్‌ నరాల్లో కణజాలలు, వెన్నెముక ఉండవు. దీంతో కండరాలపై నియంత్రణ ఏమాత్రం నియంత్రణ ఉండదు. కుమార్తెకు వెల్లూరు చికిత్స చేయించి.. తీసుకుని వస్తుండగా సృష్టి రాణికి మళ్లీ అనారోగ్యం క్షీణించింది. దీంతో ఆ చిన్నారిని బిలాస్‌పూర్‌ అపోలో ఆస్పత్రిలో చేర్చారు.. అక్కడి నుండి ఢిల్లీలో ఎయిమ్స్‌కు తరలించారు. అయినా చిన్నారికి నయం కాలేదు. ప్రస్తుతం పోర్టబుల్‌ వెంటిలేటర్‌పై చిన్నారి చికిత్స పొందుతోంది.

చిన్నారిని కాపాడాలంటే రూ.16 కోట్ల విలువైన జోల్‌జెన్‌స్మా అనే ఇంజెక్షన్‌ కావాలి. ఈ ఇంజెక్షన్‌ను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. తన ఉద్యోగి తన కూతురు విషయంలో బాధపడుతున్నాడని తెలుసుకున్న కోల్‌ ఇండియా యాజమాన్యం.. చిన్నారికి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది. అంత ధర ఉన్న ఇంజెక్షన్‌ను సతీశ్‌ లాంటి ఉద్యోగి కొనుగోలు చేయడం సాధ్యం కాదు.. అందుకే ఆ ఇంజెక్షన్‌ను తాము కొని సతీశ్‌ కూతురికి చికిత్స అందిస్తామని కోల్‌ఇండియా తెలిపింది. ప్రతీ సంస్థకు ఉద్యోగితో పాటు అతడి కుటుంబం కూడా విలువైనదే.. అందుకే వారి ప్రాణాలు కాపాడుకోవడం మా తొలి ప్రాధాన్యతన అని కోల్‌ ఇండియా పేర్కొంది. ఈ నిర్ణయంతో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు తాము ఆదర్శంగా నిలుస్తామని తెలిపింది.

Next Story