మోదీ సారథ్యంలో 259 మందితో జాతీయ కమిటీ.. సభ్యులుగా కేసీఆర్, జగన్, చంద్రబాబు
Centre Forms Committee Headed By PM Modi To Commemorate 75th Anniversary Of Independence. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకై జాతీయ కమిటీ ఏర్పాటైంది.
By Medi Samrat Published on 6 March 2021 4:50 AM GMT
ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకై జాతీయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖలకు చోటు లభించింది. మొత్తం 259 మంది ఉన్న ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, దర్శకుడు రాజమౌళి, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, మిథాలీరాజ్ తదితరులకు చోటు కల్పించారు.
అలాగే మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, జాతీయ రక్షణ సలహాదారు అజిత్ ధోవల్, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు చోటు కల్పించగా.. సినీ రంగం నుంచి రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఏఆర్ రహమాన్, లతామంగేష్కర్, ఇళయరాజా, ఏసుదాస్ తదితరులకు చోటు దక్కింది.
ఈ కమిటీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలి? ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి? అన్న దానిని నిర్ణయిస్తుంది. 8న ఈ కమిటీ తొలిసారి సమావేశం అవుతుంది. ఇంకా ఈ కమిటీలో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.