ఎక్స్ప్రెస్ రైలులోని ఏసీ కోచ్లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్తో ఇన్స్టంట్ నూడుల్స్ వండుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన పెరిగింది. సెంట్రల్ రైల్వే మహిళా ప్రయాణీకురాలిని కనుగొనే ప్రయత్నం ప్రారంభించింది. మహిళా ప్రయాణికురాలిని గుర్తించామని, ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ రైల్వే అధికారి తెలిపారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 147(1) ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోనున్నారు.
మొబైల్ ఛార్జింగ్ సాకెట్లో ఎలక్ట్రిక్ కెటిల్ ప్లగ్ పెట్టినట్లు వీడియోలో చూడవచ్చు. ఇలా 10-15 మందికి టీ సిద్ధం చేశానని మరాఠీలో మాట్లాడుతున్న మహిళ చెబుతోంది. క్లిప్ను పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది.
"రైలు లోపల ఎలక్ట్రానిక్ కెటిల్స్ ఉపయోగించడం నిషేధం. ఇది సురక్షితం కాదు, చట్టవిరుద్ధం, శిక్షార్హమైనది" అని సెంట్రల్ రైల్వే ట్విట్టర్లో పేర్కొంది. ఇది మంటలు చెలరేగడానికి కారణమవుతుంది ఇతర ప్రయాణీకులకు ప్రమాదకరంగా ఉంటుంది. ఇది విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించవచ్చు. రైలులోని AC, ఇతర ఎలక్ట్రానిక్ పోర్ట్లను కూడా దెబ్బతీస్తుందని ట్వీట్లో రాసింది. సెంట్రల్ రైల్వే ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకరమైన ప్రవర్తనకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. రైలులో భద్రతను నిర్ధారించడానికి అటువంటి కార్యకలాపాలను వెంటనే అధికారులకు నివేదించాలని కోరింది.