దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (LPG) నిల్వలకు ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళనతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, దేశీయంగా సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని భరోసా ఇచ్చింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 40 శాతం పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం ఆన్లైన్ బుకింగ్, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) విధానాన్ని పటిష్టం చేశామని, పెట్రోల్, డీజిల్ దిగుమతుల అవసరం లేకుండానే స్వయం సమృద్ధి సాధించామని పేర్కొంది.
మరోవైపు, కాలుష్య రహిత ఇంధనాన్ని ప్రోత్సహించేలా వాణిజ్య విభాగాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని పెంచాలని ప్రభుత్వం సూచించింది. పీఎన్జీ వైపు మొగ్గు చూపే రాష్ట్రాలకు 10 శాతం అదనపు వాణిజ్య ఎల్పీజీ కోటాను కేటాయించనున్నట్లు ప్రకటించింది. హోటళ్లు, ఆసుపత్రులు వంటి సంస్థలు పీఎన్జీ కనెక్షన్లు తీసుకునేలా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని తెలిపింది. వీటితో పాటు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ను రాష్ట్రాలకు కేటాయించామని, గృహ అవసరాలు మరియు రవాణా రంగానికి ఇంధన సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రిత్వ శాఖ వివరించింది.