కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌.. 32 మంది ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లు అరెస్ట్‌

CBI Summons CM Arvind Kejriwal Live Updates. ఎక్సైజ్ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

By Medi Samrat  Published on  16 April 2023 10:58 AM GMT
కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌.. 32 మంది ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లు అరెస్ట్‌

ఎక్సైజ్ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ మూడు గంటలుగా విచారిస్తోంది. అంతకుముందు సీబీఐ ప్రశ్నించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతామని.. సీబీఐని బీజేపీ కంట్రోల్ చేస్తుందని అన్నారు. కేజ్రీవాల్‌ను ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు దాదాపు ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్, మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్, మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, విద్యాశాఖ మంత్రి అతిషి, మంత్రి సౌరభ్ భరద్వాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు ​​జారీ చేయడంపై ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నిరసన తెలిపిన 32 మంది ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లు, మరో 1500 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్న 20 మంది పంజాబ్ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అని పేర్కొన్నారు.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సీబీఐ.. మనీష్ సిసోడియా, సత్యేందర్‌లను కొన్ని ప్రశ్నలు అడగాలని పిలిచి.. విచారణ జరిపి అరెస్టు చేసిందన్నారు.


Next Story