సైలెంట్‌గా ఉండండి.. లేదంటే ఈడీ మీ ఇంటికి వ‌స్తుంది : కేంద్ర మంత్రి

Calm down or ED may visit you BJP’s Meenakshi Lekhi tells Opposition MPs. లోక్‌సభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై జోరుగా చర్చ జరిగింది. కాగా.. బిల్లుపై విపక్షాలు దుమారం

By Medi Samrat  Published on  4 Aug 2023 11:17 AM GMT
సైలెంట్‌గా ఉండండి.. లేదంటే ఈడీ మీ ఇంటికి వ‌స్తుంది : కేంద్ర మంత్రి

లోక్‌సభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై జోరుగా చర్చ జరిగింది. కాగా.. బిల్లుపై విపక్షాలు దుమారం రేపుతుండగా.. ఈడీ మీ ఇంటికి రాకుండా ఉండాలంటే.. సైలెంట్‌గా ఉండమని ప్ర‌తిప‌క్షాల‌ను కేంద్ర మంత్రి మీనాక్షి హెచ్చ‌రించారు. మంత్రి ప్రకటనపై విపక్షాలు దాడికి దిగాయి. ఈ బిల్లును ఆగస్టు 2న లోక్‌సభలో ప్రవేశపెట్టారు, అయితే హోంమంత్రి అమిత్ షా మాట్లాడేందుకు లేచి నిలబడిన వెంటనే విపక్షాలు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. అనంతరం సభా కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 3న బిల్లుపై మళ్లీ చర్చ జరిగింది.

గురువారం నాటి చర్చ సందర్భంగా కూడా విపక్ష ఎంపీలు తీవ్ర దుమారం సృష్టించారు. అప్పుడు మంత్రి మీనాక్షి లేఖి లేచి.. “ఏక్ మినిట్, ఏక్ మినిట్.. శాంత్ రహో, తుమ్హారే ఘర్ ఈడీ నా ఆ జాయే” (ఒక్క నిమిషం.. ఒక్క నిమిషం.. మౌనంగా ఉండండి.. లేదంటే ఈడీ మీ ఇంటికి వ‌స్తుంది) అని సభలో ప్ర‌తిప‌క్షాల‌ను హెచ్చ‌రించారు. ఆమె ప్రకటనపై విపక్షాలు పెద్ద ఎత్తున మండిప‌డ్డాయి.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ.. ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్న ప్రతిపక్ష నేతల ఆరోపణలను.. మంత్రి వ్యాఖ్య‌లు నిజం చేశాయ‌ని అన్నారు. భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ కూడా.. మంత్రి లేఖి ప్రకటన హెచ్చరికలా లేక బెదిరింపులా అని ప్రశ్నించారు.

తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలపై ఈడీని ప్రయోగించాలని మంత్రి బహిరంగంగానే అంటున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉండండి.. లేకపోతే ఈడి మీ ఇంటికి రావచ్చు అంటున్నారు. కేవలం పార్లమెంట్‌లో మాట్లాడినందుకే ప్రతిపక్షాలపై ఈడీని ప్రయోగిస్తామని బీజేపీ మంత్రులు బహిరంగంగా బెదిరిస్తున్నారని అన్నారు.

Next Story