తమిళనాడులోని సేలం జిల్లా ఉత్తమశోలపురం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. అతివేగంతో వస్తున్న ఒక ఆర్టీసీ బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, డివైడర్ను దాటుకుంటూ అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ను, ఒక బైక్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో 11 నెలల పసికందుతో సహా మొత్తం 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉండటం గమనార్హం, అలాగే బైక్పై ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లు కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు అతివేగంగా ఉండటం వల్లే వ్యాన్, బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.