పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తీవ్ర కసరత్తులు

Budget Session of Parliament to begin on January 31. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి.

By Medi Samrat  Published on  14 Jan 2022 12:58 PM GMT
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తీవ్ర కసరత్తులు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్​ 8 వరకు పార్లమెంట్ ఉభయ సభలు పనిచేయనున్నాయి. ఈ సారి రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది. ఆ తర్వాత మార్చి 14న రెండో దశ సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 8న ముగియనున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పిటికే అన్ని ఇతర శాఖల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా నేఫథ్యంలో చిరు వ్యాపారులకు ఉద్దీపన ప్యాకేజీలు సైతం ప్రకటించే అవకాశముంది.

కరోనా మూడో వేవ్ మధ్య బడ్జెట్​ సమవేశాలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే 400 మందికిపైగా పార్లమెంట్ సిబ్బంది కొవిడ్ బారిన పడిన నేపథ్యంలో షిఫ్డుల వారీగా ఉభయ సభలు నిర్వహించే అంశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. రాజ్య సభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుందని, లోక్ సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగొచ్చని వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ రోజు మాత్రం ఇందుకు మినహాయిపు ఉండనుంది. ఈ సారి సెషన్స్ ​లో కూడా కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్​లు ధరించడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు.

బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం పార్లమెంట్‌లో శానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలించారు. ఈ సందర్భంగా 60 ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Next Story