దేశ రాజధానిలో బాంబు కలకలం
Bomb Found In Abandoned Bag At Delhi's Flower Market. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్ లో బాంబు
By Medi Samrat Published on 14 Jan 2022 10:04 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్ లో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగును గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కు, ఎన్ఎస్ జీకి సమాచారం అందించారు. హుటాహుటీన మార్కెట్ వద్దకు చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఎన్ఎస్ జీ బలగాలు ఆ బ్యాగులోని బాంబును నిర్జన ప్రదేశానికి తరలించి అక్కడ పేల్చివేశాయి. పూల మార్కెట్ సమీపంలో అనుమానాస్పద సంచి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిలో బాంబును గుర్తించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కు సమాచారం ఇవ్వడంతో వారు ప్రత్యేక వాహనంలో వచ్చి బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వీర్యం చేశారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా తెలిపారు.
జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు కొన్ని రోజుల ముందు ఈ బాంబు ఘటన చోటు చేసుకుంది. ఐఈడీని గమనించిన స్థానిక వ్యక్తి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాడు. ఢిల్లీ అగ్నిమాపక శాఖకు ఉదయం 10.20 గంటలకు అనుమానాస్పద బ్యాగ్ గురించి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోబోటిక్ స్కానర్ సహాయంతో బ్యాగ్ని స్కాన్ చేశారు. బ్యాగ్ను ఓపెన్ గ్రౌండ్కు తీసుకెళ్లి ఎనిమిది అడుగుల భూమిలోపల గొయ్యిలో పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత దాన్ని నిర్వీర్యం చేసింది.