కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి తరుణంలో గుజరాత్లో మరో ప్రాణాంతక వ్యాధి భయటపడింది. మ్యుకోర్మికోసిస్ అనే శిలీంధ్ర వ్యాధి కారణంగా అహ్మదాబాద్లో ఇప్పటికే 9 మంది మరణించగా.. మరో 30 మందికి పైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుజరాత్ తో పాటు ఢిల్లీ, ముంబాయిలోనూ ఈ వ్యాధి కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కరోనాపై పోరాడుతున్న సమయంలోనే ఈ వ్యాధి వ్యాపిస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.
ఢిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం 12 మ్యుకోర్మికోసిస్ కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ పలువురు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ వ్యాధికి గురైన వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఏంటీ ఈ వ్యాధి..
మ్యుకోర్మికోసిస్ వ్యాధిని గతంలో జైగోమైకోసిస్ అని పిలిచేవారు. ఇది చాలా అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. భయంకరమైనది. మ్యుకోర్మిసెట్స్ అనే ఒకరకమైన ఫంగస్ వలన ఈ వ్యాధి సోకుతోంది. సాధారణంగా ముక్కులో ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. అక్కడి నుంచి కళ్లకు వ్యాపిస్తుంది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు. వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైనా ట్రీట్మెంట్ తీసుకోకుండా అజాగ్రత్త వహించినా ప్రాణాలుపోయే ప్రమాదముంది.