బెంగాల్ ఓటర్ల హైజాక్‌కు బీజేపీ కుట్ర..ఈసీకి మమతా బెనర్జీ ఘాటు లేఖ!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

By -  Knakam Karthik
Published on : 31 March 2026 4:50 PM IST

National News, Mamata Banerjee, WestBengal, BJP, Election Commission, VoterListScam

బెంగాల్ ఓటర్ల హైజాక్‌కు బీజేపీ కుట్ర..ఈసీకి మమతా బెనర్జీ ఘాటు లేఖ!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్ ఓటర్ల జాబితాలో బయటి వ్యక్తులను చేర్చేందుకు బీజేపీ భారీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి ఘాటుగా లేఖ రాశారు. వేల సంఖ్యలో నకిలీ ఫారమ్-6 దరఖాస్తుల ద్వారా ఇతర రాష్ట్రాల నివాసితులను ఇక్కడి ఓటర్లుగా నమోదు చేసేందుకు బీజేపీ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆమె మండిపడ్డారు.

మహారాష్ట్ర, ఢిల్లీలలో ఆడినట్లే బెంగాల్‌లో కూడా 'ఓటర్ల హైజాకింగ్' అనే మురికి రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని ధ్వజమెత్తారు. సుమారు 60 లక్షల మంది అసలైన ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఈ నకిలీ దరఖాస్తులను ఈసీ రహస్యంగా పరిశీలించడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. గతంలో బీహార్, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. అలాగే పురూలియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అల్లర్లను ప్రేరేపించేందుకు బీజేపీ యత్నిస్తోందని, ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు మాంసాహారం తినే స్వేచ్ఛను కూడా కోల్పోతారని హెచ్చరించారు.

Next Story