పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పురూలియాలో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (BJP) పై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, మతపరమైన అంశాలపై బీజేపీ వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, ముఖ్యంగా మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలను తిననివ్వకుండా ఆంక్షలు విధిస్తుందని ఆమె ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు తినడంపై కూడా ఆంక్షలు ఉన్నాయని, బెంగాలీ సంస్కృతిలో భాగమైన ఆహారపు అలవాట్లను వారు గౌరవించరని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఏ మతాన్నీ నిజాయితీగా నమ్మదని, కేవలం అల్లర్లను సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టి, హింస ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి లక్ష్యమని మమతా బెనర్జీ విమర్శించారు. దేశవ్యాప్తంగా గిరిజనులు మరియు మహిళలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇటువంటి అకృత్యాలు అత్యధికంగా నమోదవుతున్నాయని ఆమె గణాంకాలను ఎత్తిచూపారు.
అంతేకాకుండా, ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బెంగాలీ భాష మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ సంస్కృతిని, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి తాము నిరంతరం పోరాడతామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.