మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని ఐష్బాగ్ స్టేడియం సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) అధికారిక ప్రారంభోత్సవానికి ముందే వివాదానికి కేంద్రంగా మారింది. రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన 648 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు గల ఈ వంతెనలో 90 డిగ్రీల మలుపు ఉండటం స్థానిక నివాసితులు, సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదాలకు కేంద్రంగా మారుతుందని భయపడుతున్నారు.
ఐష్బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఎక్కువసేపు వేచి ఉండటాన్ని తొలగించడం లక్ష్యంగా పెట్టుకుని మహామైకా బాగ్, పుష్పా నగర్, స్టేషన్ ప్రాంతం, న్యూ భోపాల్ మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి ఉద్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం మార్చి 2023లో ప్రారంభమైన వంతెన నిర్మాణం ట్రాఫిక్ అడ్డంకులను తగ్గించడం ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, దీని విచిత్రమైన డిజైన్ విమర్శలకు కారణమైంది. వంతెనకు ఒక చివరన ఉన్న 90-డిగ్రీల ఇరుకైన మలుపు ఆన్లైన్లో విస్తృతంగా చర్చకు కారణమైంది. మెట్రో స్టేషన్ కారణంగా, ఆ ప్రదేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉందని, స్థలం లేకపోవడం వల్ల, వేరే మార్గం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ అధికారులు తెలిపారు.