ఎయిర్ పోర్టులో రెండు బాంబులు పెట్టామంటూ బెదిరింపులు

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat
Published on : 19 Jun 2025 4:45 PM IST

ఎయిర్ పోర్టులో రెండు బాంబులు పెట్టామంటూ బెదిరింపులు

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఈమెయిల్ సందేశంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ అంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు.

బుధవారం రాత్రి విమానాశ్రయ భద్రతా విభాగానికి ఒక ఈమెయిల్ అందింది. తాను ఒక ఉగ్రవాదినని ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో రెండు శక్తివంతమైన బాంబులు అమర్చినట్లు తెలిపాడు. విమానాశ్రయంలోని టాయిలెట్ పైపులో మరో పేలుడు పరికరాన్ని కూడా పెట్టినట్లు హెచ్చరించాడు. తక్షణమే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి, విమానాశ్రయం నలుమూలలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంటల తరబడి సాగిన ఈ ముమ్మర గాలింపు చర్యల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఆకతాయిల పనిగా, నకిలీ బెదిరింపుగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు.

Next Story