పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఆహార మరియు సరఫరాల శాఖ సహాయ మంత్రి జ్యోత్స్నా మండి భర్త తుహీన్ మండిని శుక్రవారం రాత్రి బంకురా జిల్లాలోని ఖత్రా పట్టణంలోని మార్కెట్లో కొందరు వ్యక్తులు బహిరంగంగా కొట్టారు. ఈ కేసులో స్థానిక బీజేపీ నేత శంతను సింగ్తో పాటు ఆ పార్టీకి చెందిన నలుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై జ్యోత్స్న మండి మాట్లాడుతూ.. 'నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు రాజకీయాలలో ప్రమేయం లేదు. బీజేపీ కార్యకర్తలు ఆయనను టార్గెట్ చేశారు. ఇది ఖత్రా నగరాన్ని కలవరపరిచే కుట్ర. ఈ ఘటనపై పోలీసులకు-అధికార యంత్రాంగానికి, పార్టీ అగ్రనాయకత్వానికి తెలియజేశాను. వారు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి మార్కెట్లో 15-16 మందితో కూడిన బృందం మంత్రి భర్తపై దాడి చేసింది. కర్రలతో కొట్టడంతో వీపు, కుడి చేతికి గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న కొందరు ఆయనను రక్షించి ఖత్రా డిపార్ట్మెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తుహీన్ తన ఇంటికి చేరుకున్నారు.
ఘటనపై బీజేపీ బంకురా సంస్థాగత జిల్లా అధ్యక్షుడు ప్రసేన్జిత్ చటోపాధ్యాయ మాట్లాడుతూ.. సమా కార్యకర్తలను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు. సాక్షాత్తూ మంత్రి భర్త తీరుపై ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. మరోవైపు తృణమూల్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని జిల్లా సంస్థాగత కార్యదర్శి దీపక్ దాస్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేశారని.. లాఠీచార్జిలో మంత్రి భర్త గాయపడి ఉండవచ్చని అన్నారు.