హిమాచల్ప్రదేశ్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. గత 24 గంటల్లో హిమాచల్లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 9 మంది చనిపోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో 4 జాతీయ రహదారులతో సహా అనేక రహదారులు మూసివేశారు. హిమాచల్లోని బిలాస్పూర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.
చండీగఢ్-మనాలి జాతీయ రహదారి మూసివేశారు. లేహ్ మనాలి హైవేపై 20 గంటలుగా ఎలాంటి రాకపోకలు లేవు. బియాస్ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆస్తి నీటిలో కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్లో పలు నదులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిలు కొట్టుకుపోతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వాతావరణ శాఖ ప్రకారం.. బిలాస్పూర్లోని నంగల్ డ్యామ్లో 282, బిలాస్పూర్లో 224, ఉనాలో 228, ఒలిండాలో 215, లాహౌల్లోని గోంద్లాలో 122 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని బిలాస్పూర్, చంబా, హమీర్పూర్, కాంగ్రా, మండి, సిర్మౌర్, సోలన్, ఉనాలో భారీ వర్షాలు కురిశాయి. ఇది కాకుండా.. సిమ్లాలో 80 మిల్లీమీటర్లు, సుందర్నగర్లో 83, మనాలి 131, సోలన్ 107, నహాన్ 131, పాలంపూర్, చంబా 146, బిలాస్పూర్ 130, ధౌలాకువాన్ 81, కాంగ్రాలో 175 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.