భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీరా లెబ్బయ్ మరాయ్కయార్ కన్నుమూశారు. 104 ఏళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 07.30 గంటల సమయంలో రామేశ్వరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కలాం పెద్దన్నయ్య మరణించడంతో రామేశ్వరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మహమ్మద్ ముత్తుమీరా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన నివాసంలోనే ఉంచారు.
ఇటీవలే ఆయన తన 104వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనుండగా, ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని నివాసంలో ఉంచారు. మరైకర్ మృతి విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషల్లో సంతాపం తెలిపారు. కలామ్ అన్న ముత్తు మీరా మరైకయార్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. అబ్దుల్ కలాం 2002, జులై 25 నుంచి 2007, జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. ఏపీజే అబ్దుల్ కలాం 2015 జులై 27న మేఘాలయాలోని షిల్లాంగ్లో గుండెపోటుతో ఆయన మరణించారు.