కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్, నికోబార్ దీవులు సరికొత్త రికార్డు సృష్టించాయి. అక్కడ 18 ఏళ్ల వయస్సు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేశారు. 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తైనట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. మొత్తం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉపయోగించి ఈ మైలురాయిని పూర్తి చేశారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్, నికోబార్ దీవులు నిలిచాయి. ఈ అసాధారణ ఫీట్ కోసం అధికారులు ఎంతో శ్రమించారు.
అండమాన్, నికోబార్ దీవుల పరిపాలన కేంద్రపాలిత ప్రాంతంలో టీకాలు వేయడం కష్టతరం కూడుకున్న పని.. ఎందుకంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు 800 కి.మీ.లో విస్తరించి ఉన్న 836 ద్వీపాలలో.. వ్యాక్సిన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడుగా సముద్రం, అత్యంత దట్టమైన వర్షారణ్యాలు, కొండలు, వాతావరణం సరిగ్గా సహకరించదు. అయినా ఎట్టకేలకు 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ఏడాది జనవరి 16 నుండి అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. హెల్త్ బులెటిన్ ప్రకారం, 2.87 లక్షల మంది వ్యక్తులు కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. ద్వీపసమూహంలోని మొత్తం జనాభాలో 74.67% మందికి టీకాలు వేయబడ్డాయి. ప్రస్తుతం అక్కడ రెండు క్రీయాశీలక కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని సమాచారం.