Budget 2024: నేడే మధ్యంతర బడ్జెట్‌.. సర్వం సిద్ధం

ఈ ఏడాది చివర్లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

By అంజి  Published on  1 Feb 2024 3:07 AM GMT
Budget 2024, PM Modi, National news, Nirmla Sitharaman

Budget 2024: నేడే మధ్యంతర బడ్జెట్‌.. సర్వం సిద్ధం

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఇది ఆమె ఆరో బడ్జెట్, మోడీ ప్రభుత్వంలో చివరిది. ఉదయం 11 గంటలకు ఆమె ఉభయసభల్లో ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్‌ చేరుకుంటారు. అనంతరం 10.30 గంటలకు పార్లమెంట్‌ ఆవరణలో జరగనున్న కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. 1 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

యువత, మహిళలు, రైతులు, పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్యంతర బడ్జెట్‌లో పలు సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు మధ్యంతర బడ్జెట్ ఆర్థిక అవసరాలను చూసుకుంటుంది. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల వేళ సామాన్యుల ఆశలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉండే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి తన ప్రసంగంలో, 2023 దేశానికి చారిత్రాత్మక సంవత్సరం అని, ఇతర దశలతో పాటు, దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఊపందుకుంది అని అన్నారు. “ప్రపంచ సంక్షోభం ఉన్నప్పటికీ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన 2023 సంవత్సరం భారతదేశానికి ఒక చారిత్రాత్మక సంవత్సరం. వరుసగా రెండు త్రైమాసికాల్లో భారత్‌ దాదాపు 7.5 శాతం వృద్ధిని సాధించింది' అని ఆమె చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో 10 రోజుల పాటు మొత్తం ఎనిమిది సభలు జరుగుతాయి.

Next Story