ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా బీహార్లోని మహాఘట్బంధన్ నాయకులతో తమ పార్టీ చర్చలు జరుపుతున్నట్లు హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ఒవైసీ పేర్కొన్నారు.
AIMIM బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్, RJD, కాంగ్రెస్ నాయకులతో సహా మహాఘట్బంధన్ నాయకులతో చర్చలు ప్రారంభించారని ఒవైసీ వెల్లడించారు. బీజేపీ, ఎన్డీఏలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బలాన్ని పెంచుకోవడానికి మహాఘట్బంధన్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని AIMIM పరిశీలిస్తోందని చెప్పారు. కూటమి పార్టీలు భాగస్వామ్యానికి అంగీకరించకపోతే, బీహార్ అంతటా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి AIMIM సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో AIMIMకు మంచి పట్టు ఉందని, తమ పార్టీకి అక్కడ గణనీయమైన ప్రజా మద్దతు ఉందని తెలిపారు. సీమాంచల్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా పోటీ చేయాలని తమ పార్టీ యోచిస్తోందని ఒవైసీ పేర్కొన్నారు.