పిల్లలపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ షురూ.. థర్డ్ వేవ్ భయం వెంటాడుతూ..!
AIIMS Delhi started trials on children. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మంది పిల్లలకు కూడా మహమ్మారి సోకింది.
By Medi Samrat Published on 7 Jun 2021 8:21 AM GMT
కరోనా సెకండ్ వేవ్ లో ఎంతో మంది పిల్లలకు కూడా మహమ్మారి సోకింది. ఇక థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక పిల్లలకు కరోనా వ్యాక్సిన్ తీసుకుని వచ్చే అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి.
కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ఇందు కోసం తాము 18 మంది చిన్నారులను ఎంపిక చేశామని ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. కరోనా మూడో దశ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో ఈ క్లినికల్ ట్రయల్స్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే ఈ పరీక్షలకు డీజీసీఐ అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిని చిన్న పిల్లలకు వేసేందుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు.
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు తగినంత మందికి టీకాలు వేయకపోతే మూడో వేవ్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలపై థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఇప్పటివకే వైద్య నిపుణులు హెచ్చరించడంతో తల్లిదండ్రుల్లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి.