ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
By Knakam Karthik
ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. చిన్న స్వామి స్టేడియం వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. కాగా ఐపీఎల్ 2025 ఛాంపియన్షిప్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆర్సీబీ జట్టు ట్రోఫీతో స్టేడియంకు వస్తుందని, ఆటగాళ్లతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొనవచ్చని భావించిన వేలాది మంది అభిమానులు బుధవారం సాయంత్రం నుంచే చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు. జట్టు రాక కోసం ఎదురుచూస్తూ స్టేడియం గేట్ల వద్ద భారీగా జనం చేరారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. క్షతగాత్రులను శివాజీనగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆర్సీబీ టీమ్కు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది.