యూపీ, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లో బీజేపీ హవా

5 states election result updates. ఉదయం 8 గంటల నుండి ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఎంతో ఉత్కంఠతో సాగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌పై

By అంజి  Published on  10 March 2022 4:50 AM GMT
యూపీ, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లో బీజేపీ హవా

ఉదయం 8 గంటల నుండి ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌ ఎంతో ఉత్కంఠతో సాగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్‌పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పైనే అందరి దృష్టింది. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చెప్పాయి. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా కనబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 403 స్థానాలకు 7 విడతల్లో పోలింగ్‌ జరిగింది. మొత్తం 75 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 222 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అధిక్యం ప్రదర్శిస్తున్నారు. సమాజ్‌వాద్‌ పార్టీ 106 స్థానాల్లో, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో, బీఎస్పీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. లఖింపూర్‌ ఖేరీ జిల్లాలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది.

ఇక పంజాబ్‌ రాష్ట్రంలో ఆప్‌ పార్టీ దూసుకుపోతోంది. 75 స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్‌ 22 స్థానాలు, ఎస్‌ఏడీ కూటమి 14 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బీజేపీ నామమాత్రంగానే ఉంది. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 59 సీట్లు కావాలి. మొత్తం స్థానాలు 117

మణిపూర్‌ రాష్ట్రంలో బీజేపీ హవానే కొనసాగుతోంది. మొత్తం 60 స్థానాల్లో బీజేపీ 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 9 స్థానాల్లో, ఎన్సీపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనూ బీజేపీ తన దూకుడు కొనసాగిస్తోంది. 40 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 25 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ మొత్తం 70 స్థానాలు ఉన్నాయి.

గోవా రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 4 చోట్ల ముందంజలో ఉండగా.. ఇక్కడ మొత్తం స్థానాలు 40 ఉన్నాయి.

Next Story