టీచర్‌పై విద్యార్థుల లైంగిక వేధింపులు.. బరితెగించి అసభ్యకరమైన పదజాలంతో.. వీడియో

4 minors pass lewd comments on teacher in Uttarpradesh. విద్యా బుద్ధులు నేర్పుతున్న టీచర్‌ని గౌరవించాల్సిన విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు.

By అంజి  Published on  27 Nov 2022 9:38 AM GMT
టీచర్‌పై విద్యార్థుల లైంగిక వేధింపులు.. బరితెగించి అసభ్యకరమైన పదజాలంతో.. వీడియో

విద్యా బుద్ధులు నేర్పుతున్న టీచర్‌ని గౌరవించాల్సిన విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. టీచర్‌ అనుమతి లేకుండా.. ఆమె వీడియోలు తీశారు. ఆమెను అసభ్యకర వ్యాఖ్యలతో వేధించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో నలుగురు మైనర్‌ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఇంటర్‌ చదువుతున్న నలుగురు మైనర్‌ విద్యార్థుల్లో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం అవుతున్నాయి. వీడియోలో.. ఉపాధ్యాయురాలు విద్యార్థుల నుండి దూరంగా వెళుతున్నట్లు చూపిస్తుంది. కెమెరా వైపు చూడకుండా వెళ్లిపోయింది. అయితే ఒక అబ్బాయి ''ఐ లవ్ యూ, దయచేసి ఇక్కడ చూడండి.'' అంటూ టీచర్‌ పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిని సెక్షన్ 354 (ఎవరైనా మహిళపై దాడి చేసినా లేదా క్రిమినల్ బలవంతంగా ప్రయోగించినా, ఆగ్రహానికి గురిచేసే ఉద్దేశ్యంతో లేదా ఆమె నిరాడంబరతకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిసినా) , 500 (పరువునష్టం కోసం శిక్ష)తో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అమన్, కైఫ్, అతాష్ అనే ముగ్గురు విద్యార్థులు తనను వేధిస్తున్నారని టీచర్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ చర్యలో పాల్గొన్న అమన్ సోదరి పేరును కూడా ఆమె పేర్కొంది. మొదట టీచర్‌ ఈ వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఇది తప్పు, చట్టవిరుద్ధమని చెబుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం చేసింది.

అయినప్పటికీ విద్యార్థులు టీచర్‌ మాటలను పట్టించుకోలేదు. అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఆమెను వేధిస్తూనే ఉన్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ వీడియోలు వెంటనే వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను బంధువు టీచర్‌కి చూపించడంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ సంఘటన ఆమెను మానసికంగా గాయపరిచింది. ఆమె కళాశాలకు హాజరుకాలేకపోయింది. విద్యార్థులకు కూడా ఎదురు చెప్పలేకపోయింది. చివరకు నిందితులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. కిథోర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ ఘటనపై మీరట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కేశవ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ముగ్గురు నిందితులను గుర్తించామని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వారిని పట్టుకున్న వెంటనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.


Next Story