దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న ఓ తండ్రి ఇద్దరు పిల్లలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన చర్య వారి ప్రాణాల మీదకు తెచ్చింది. మంటలు చెలరేగిన తర్వాత, ఇద్దరు పిల్లలు, తండ్రి మంటల నుండి తప్పించుకోవడానికి భవనం యొక్క ఏడవ అంతస్తు నుండి కిందకు దూకారు. స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ పిల్లలు చనిపోయినట్లు ప్రకటించారు.
అపార్ట్మెంట్లో చిక్కుకున్న మృతుడి యాదవ్ భార్య, పెద్ద కుమారుడు అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా వారిని కూడా చికిత్స కోసం ఐజీఐ హాస్పిటల్కు తరలించారు. అగ్నిప్రమాదం ఘటన తర్వాత అపార్ట్మెంట్లోని నివాసితులను అక్కడ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా ఆ అపార్ట్మెంట్కు విద్యుత్, పీఎన్జీ కనెక్షన్లు నిలిపివేశారు.
అయితే అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని 8 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 13లోని బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.