నాని-సుధీర్ బాబు 'వి' సినిమా ఇక ఇంట్లోనే చూడాల్సిందే.. ఆ తర్వాత అనుష్క రానుందా..?  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 3:30 AM GMT
నాని-సుధీర్ బాబు వి సినిమా ఇక ఇంట్లోనే చూడాల్సిందే.. ఆ తర్వాత అనుష్క రానుందా..?  

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని.. 'వి' ద్వారా తనలోని విలనిజాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు. వెండితెరపై రచ్చ చేయాలని భావించారు.. కానీ పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. ఓటీటీ అని కొందరు చెబితే.. లేదు థియేటర్ లో రిలీజ్ అంటూ చెబుతూ వచ్చారు. ఇక అఫీషియల్ గా 'వి' సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ అతి త్వరలోనే ప్రకటన ఇవ్వనుంది.

''సినిమా అయిపోతేనేమి.. మళ్ళీ చూస్తా.. మళ్ళీ మళ్ళీ చూస్తా.. నాకు ఇష్టమొచ్చినన్ని సార్లు చూస్తా.. థియేటర్ ఇంటికి వచ్చినా రాకపోయినా థియేటర్ ఎక్స్ పీరియన్స్ మాత్రం ఇంటికి రాబోతోంది. మన ఇళ్లే థియేటర్ గా మారబోతోంది'' అంటూ నాని ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేసాడు.

నాని కెరీర్ లో 25వ సినిమాగా వస్తున్న సినిమా 'వి'. అదితి రావ్ హైదరి - నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తున్నాడు. మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది వీలు పడలేదు. చూస్తుంటే మరి కొన్ని టాలీవుడ్ సినిమాలు ఓటీటీ బాట పట్టనున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో 'వి' సినిమాను సెప్టెంబర్ 5 నుండి స్ట్రీమ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూద్దాం నాని తన నెక్స్ట్ పోస్టులో ఏమని చెబుతాడో..?

అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ ఇప్పట్లో అది కష్టమేనని భావించిన నిర్మాతలు ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదిరిందని అంటున్నారు.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో మాధవన్, అంజలి నటించారు. ఓటీటీ రిలీజ్ గురించి చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Next Story