మీరు విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ క్వారంటైన్‌ రూల్స్‌ తెలుసుకోవాల్సిందే..!

Quarantine Rules To Other Country Travel. కోవిడ్‌ కారణంగా ప్రపంచ దేశాలు సైతం తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆర్థికంగా కోలుకోని

By Medi Samrat  Published on  13 March 2021 2:48 AM GMT
మీరు విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ క్వారంటైన్‌ రూల్స్‌ తెలుసుకోవాల్సిందే..!
కోవిడ్‌ కారణంగా ప్రపంచ దేశాలు సైతం తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆర్థికంగా కోలుకోని విధంగా మారిపోయాయి. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిగా, ఇప్పుడిప్పుడు కాస్త కోలుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవడం, కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం వల్ల పలు దేశాలు విదేశీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో విదేశాల్లో సేదతీరేందుకు పర్యాటకులు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా దుబాయ్‌‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, మలేషియా వంటి దేశాల్లో హాలిడే ట్రిప్‌కు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టింది ఆయా దేశాలు. పర్యటకు వెళ్లిన వారు ఆయా దేశాల్లో క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సిందే. క్వారంటైన్‌ నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం..


సింగపూర్‌లో..

సింగపూర్‌ క్వారంటైన్‌ నిబంధనల ప్రకారం.. సింగపూర్‌కు బయలుదేరే 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగెటివ్‌ వస్తేనే అనుమతి ఉంటుంది. ఏడు సంవత్సరాలకుపైబడిన పిల్లల నుంచి మొదలుకొని కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. సింగపూర్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్నతర్వాత అక్కడ ప్రయాణికులకు మరోసారి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షను చేస్తారు. ఈ పరీక్షలకు అయ్యే ఖర్చు ప్రయాణికుడే భరించుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టులో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఖర్చు దాదాపు రూ.12వేల వరకు ఉంటుంది. ప్రయాణికుడి ట్రావెట్ హిస్టరీని బట్టి.. అక్కడి అధికారులు స్టే హోం నోటీసును జారీ చేస్తారు.

మలేషియాలో…

మలేషియా కరోనా నిబంధనల ప్రకారం.. మలేషియా బయలుదేరిన 72 గంటల ముందు ప్రయాణికుడు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. అందులో నెగిటివ్ రిపోర్టు వస్తేనే మలేషియాకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక మలేషియా చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్టులో మరోసారి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇతర దేశాల నుంచి మలేషియాకు వెళ్లిన ప్రతి ప్రయాణికుడు 7 రోజుల పాటు క్వారంటైన్‌ ఉండాల్సిందే. క్వారంటైన్‌ ఐదు రోజులు గడిచిన తర్వాత అధికారులు మరోసారి కోవిడ్‌ పరీక్షల చేసే అవకాశం ఉంది. అందులో నెగెటివ్‌ రిపోర్టు వస్తే ఆ దేశ పర్యటనకు అనుమతి ఇస్తారు. లేకపోతే మళ్లీ క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

యూఏఈ క్వారంటైన్‌ నిబంధనలు..

యూఏఈ కొన్ని దేశాలను హైరిస్క్‌ దేశాల జాబితాలో ఉంచింది. ఈ ఏడాది జనవరి 17న అబుదాబిలో అమలులోకి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో దాదాపు 14 రోజుల పాటు ఉండాలి. ఇమ్మిగ్రేషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ప్రయాణికులు అధికారులు వ్రిస్ట్ బ్యాండ్‌ను అందిస్తారు. ఇక క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నన్ని రోజులు ఓ బ్యాండ్‌ను ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారా అధికారులు సదరు ప్రయాణికుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. అలాగే ఈ క్వారంటైన్‌ కేంద్రానికి వెళ్లిన ఎనిమిదో రోజుకు సదరు ప్రయాణికులకు అధికారులు మరోసారి పీసీఆర్ టెస్ట్ చేస్తారు.

దుబాయ్‌, షార్జా వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణానికి 96 గంటల ముందు పీసీఆర్‌ టెస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో నెగెటివ్‌ వస్తేనే అనుమతి ఉంటుంది. నెగెటివ్‌ రిపోర్టును చూపించిన వారికి మాత్రమే దుబాయ్‌, షార్జాకు ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. షార్జాకు వెళ్లే పర్యాటకులు, షార్జా నివాసితులు అక్కడికి చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్టులో మళ్లీ పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. వాటి ఫలితాలు వచ్చే వరకు క్వారంటైన్‌లోనే ఉండాలి. ఎటు వెళ్లేందుకు అనుమతి ఉండదు. ఒక వేళ ఫలితాల్లో పాజిటివ్‌గా తేలితే 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. దుబాయ్‌లో కూడా దాదాపు ఇదే రకమైన మార్గదర్శకాలే అమలు అవుతున్నాయి. ఇక యూఏఈ లో క్వారంటైన్‌ రూల్స్‌ అతిక్రమించినట్లయితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో దాదాపు రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుందని సమాచారం.

థాయ్‌లాండ్‌లో..

థాయ్‌లాండ్‌ నిబంధనలపై ఇప్పుడు ప్రయాణికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. అనుమతి పొందిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రయాణికులు తమ దేశానికి వస్తే వారికి 14 రోజుల క్వారంటైన్‌ రూల్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని థాయ్‌లాండ్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ తీసుకుని థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లయితే క్వారంటైన్‌ అవసరం ఉండదు మరో విషయం ఏంటంటే.. తాజాగా అక్కడి ఓ ప్రముఖ పత్రిక వెలువరించిన కథనం ప్రకారం.. థాయ్‌లాండ్ వెళ్లిన పర్యాటకులకు 14 రోజుల క్వారెంటైన్ తప్పనిసరి అని తెలుస్తోంది.

ఇలా కరోనా మహమ్మారి కారణంగా ఈ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లినట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందులో సమయం, డబ్బులు వృథా అవుతాయి. ఇందుకే విదేశీ పర్యటనకు వెళ్లే ప్రయాణికులు కాస్త ఆలోచించి వెళ్తే బెటర్‌.


Next Story