చిత్తూరు: తహసీల్దారు దారుణ హత్య
By సుభాష్
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. విధినిర్వహణలో ఉన్న ఓ తహసీల్దార్ను దారుణంగా నరికి చంపాడు ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు. ఈ దారుణ హత్య జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
కోలాపూర్ జిల్లా బంగారుపేట తాలుకలోని పెరియకలవంచి తహసీల్దార్ చంద్రమౌళి (55)ను అదే గ్రామానికి చెందిన వెంకటపతి అనే రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు హత్య చేశాడు. ప్రభుత్వ భూముల సర్వే కోసం గ్రామానికి వచ్చిన తహసీల్దార్ను తమ భూమి సర్వే చేయడానికి ఒప్పుకునేది లేదని వెంకటపతి అడ్డుకున్నారు. అయితే ఇది వరకే సర్వే చేసేందుకు వచ్చిన తహసీల్దార్ను ఆయన అడ్డుకోవడంతో, తర్వాత మళ్లీ సర్వే కోసం వచ్చాడు. దీంతో పోలీసు బలగాలతో తహసీల్దార్ సర్వే చేయించాడు.
తన భూమిని అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్ను అక్కడే ఉన్న కత్తితో నరికి చంపాడు. దీంతో తహసీల్దార్ కుప్పకూలిపోగా, సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చంద్రమౌళి మృతి చెందాడు. నిందితుడు హత్య చేసిన అనంతరం అక్కడే ఉన్న పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.