గాంధీలో మరోసారి బయటపడ్డ నిర్లక్ష్యం.. కనిపించకుండాపోయిన వ్యక్తి మృతదేహం మార్చురీలో..
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Jun 2020 1:36 PM GMTగాంధీ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలయింది. జూన్ 1న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి కనిపించకుండా పోయిన కోవిడ్-19 అనుమానితుడు మృతదేహాన్ని నేడు గాంధీ మార్చురీలో గుర్తించారు అతని కుటుంబసభ్యులు. పోలీసులు, చనిపోయిన మనిషి కుటుంబం 20 రోజుల వెతికిన తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని నేడు గాంధీ మార్చురీలో స్వాధీనం చేసుకున్నారు.
వివరాళ్లోకెళితే.. 29 ఏళ్ల నరేందర్ సింగ్ కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో తరువాత మే 29న గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అయితే.. నరేందర్ సింగ్ మే 31 వరకు అతని కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నాడు. జూన్ 1వ తారీఖు నుండి నరేందర్ సింగ్ అతని కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాకపోవడంతో వారు ఆసుపత్రి అధికారులను సంప్రదించారు.
అయినా నరేందర్ ఆచూకీని గుర్తించడంలో ఆసుపత్రి సిబ్బంది సహకరించడం లేదని.. జూన్ 6న నరేందర్ తల్లి మంగళహట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడం.. నేడు ఏకంగా మృతదేహం ప్రత్యక్షమవడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేందర్ మృతిపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.