మెద‌క్‌ అడిషనల్ కలెక్టర్ న‌గేష్‌ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2020 12:59 PM GMT
మెద‌క్‌ అడిషనల్ కలెక్టర్ న‌గేష్‌ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్‌వోసీ ఇవ్వ‌డం కోసం నగేష్ రూ.1.12కోట్లు‌ డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి ముందుగా కుదు‌ర్చుకున్న డీల్‌లో భాగంగా రూ.1.12 కోట్ల డీల్‌లో రూ.40లక్షలు అడ్వాన్స్‌ తీసుకుంటుండగా న‌గేష్ ఏసీబీ చేతికి చిక్కారు. దీంతో నగేష్‌తో పాటు అరుణారెడ్డి, సత్తార్, వసీం, బినామీ జీవన్‌గౌడ్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

అనంత‌రం మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్‌తోపాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, బినామీ జీవన్‌గౌడ్‌లను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఐదుగురు నిందితులను 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.

ఈ నెల 21న చంచల్‌గూడ జైలు నుంచి ఏ1 అడిషనల్ కలెక్టర్ నగేష్, ఏ2 వసీం, ఏ3 అరుణారెడ్డి, ఏ4 అబ్దుల్ సత్తార్, ఏ5 జీవన్‌గౌడ్‌లను ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. ఏసీబీ కేసులో అరెస్టయిన నలుగురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నలుగురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story