లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

By Newsmeter.Network  Published on  5 April 2020 4:18 AM GMT
లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 3,082మంది ఈ వైరస్‌ భారిన పడగా, 86మంది మృత్యువాత పడ్డారు. తాజాగా శనివారం ఒక్కరోజే 515 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. ఇదిలాఉంటే ఆదిలోనే వైరస్‌ వ్యాప్తిని నిరోదించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా గత నెల 22న జనతా కర్ఫ్యూను విధించిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఆ మరుసటి రోజు నుండే ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. దీంతో అన్ని రాష్ట్రాలు కేంద్ర సూచనలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ప్రజలెవరూ అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఎప్పటికప్పుడు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాంటాక్ట్‌ కేసులు పెరగకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు వివరిస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టారు.

Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…

మార్చి 30వరకు అంతా అదుపులోనే ఉందని భావించారు. పలు రాష్ట్రాలు.. ఏప్రిల్‌ 14 కంటే ముందే లాక్‌ డౌన్‌ ఎత్తివేయవచ్చని భావించాయి. కానీ అనూహ్య రీతిలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా వరుస కేసులు పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేసుల పెరుగుదలపై ఆరాతీయగా.. ఢిల్లిలోని నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనల వల్లేనని తేలింది. మార్చి 1నుంచి 15 వరకు ఢిల్లిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని తబ్లిగ్‌ -ఏ-జమాత్‌ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో పలువురు విదేశీయులు ఉండటం, వారి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైరస్‌ సోకినట్లు కేంద్రం గుర్తించింది. అప్పటికే దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు సంఖ్య ఒక్కసారిగా పెరుగుకుంటూ వచ్చింది.

Also Read :12 తరువాతే నిర్ణయం తీసుకుంటాం

దేశవ్యాప్తంగానే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పటి వరకు అదుపులో ఉన్న కరోనా వైరస్‌ ఒక్కసారిగా విజృంభించింది. తెలంగాణలో 40 కోరనా పాజిటివ్‌ కేసుల నుంచి 270వరకు చేరింది. ఏపీలో 20 నుంచి 194 పాజిటివ్‌ కేసులు చేరుకోవటంతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆయా ప్రభుత్వాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనల్లో ఎవరెవరు పాల్గొన్నారు అని ఆరాతీసి వారిని క్వారంటైన్‌లకు తరలించారు. అనుమానితులను ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. వైరస్‌ సోకినవారు ఢిల్లి నుంచి వచ్చి క్వారంటైన్‌లోకి వెళ్లకపోవటంతో భారీగా కాంటాక్ట్‌ కేసులు పెరగడం మొదలయ్యాయి. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 30శాతం మంది తబ్లిగీలతో సంబంధమున్నవారేనని కేంద్రం నిర్దారించింది.

Also Read : కరోనాపై వృద్ధుడితో మంత్రి హారీశ్‌ రావు ఆసక్తికర సంబాషణ

ఈ నేపథ్యంలో లాక్‌ డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితి నెలకొందని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్‌ 14 తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ప్రజలంతా ఒక్కసారిగా బయటకు వస్తే మరింత ప్రమాదం ఉంటుందని కేంద్ర పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మతప్రార్థనల్లో పాల్గొన్న వారి నుండి వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తేనే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం పాటు లాక్‌ డౌన్‌ను పొడిగించి.. ఆ తరువాత విడతల వారీగా కొద్దిపాటి నిబంధనలతో ప్రజలను అప్రమత్తం చేస్తేనే కరోనా వ్యాప్తి నుండి తప్పించుకోగలుగుతామని కేంద్రం పెద్దలు భావిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 తరువాత కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా కట్టడికి చర్యలను ఎలా వేగవంతం చేస్తుంది..? మతపరమైన కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారి ద్వారా వ్యాపిస్తున్న వైరస్‌ వ్యాప్తికి ఎలా అడ్డకట్ట వేస్తుందోననే ఆలోచనలు ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతీ ఒక్కరి మొదడుల్లో మెదులుతున్నాయి. మరి కేంద్రం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో.. వైరస్‌ వ్యాప్తి నివారణకు మోదీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Also Read :కరోనా కట్టడికి.. ఒక్క చుక్క టీకా..! త్వరలో అందుబాటులోకి..

Next Story