ఆ వ్యాఖ్య‌లు మ‌మ్మ‌ల్ని ఉద్దేశించి చేసినవి కావు : సిబల్, ఆజాద్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2020 12:04 PM GMT
ఆ వ్యాఖ్య‌లు మ‌మ్మ‌ల్ని ఉద్దేశించి చేసినవి కావు : సిబల్, ఆజాద్

రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సమావేశం వేధిక‌గా కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు బీజేపీ తొత్తుల్లా వ్యవహరించారంటూ చేసిన వ్యాఖ్యలు తమను ఉద్దేశించి చేసినవి కావని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోనియా అనారోగ్యంగా ఉన్న సమయంలో పార్టీ నాయకత్వాన్ని వేరొకరికి ఇవ్వాలంటూ లేఖలు రాసిన సీనియర్ నేతలపై రాహుల్ విరుచుకుపడ్డారని.. సీనియర్ నేతలు రాసిన లేఖను లీక్ చేసిన వారిపై కూడా రాహుల్ మండిపడ్డారని వార్తలు వెలువడ్డాయి.

అయితే.. రాహుల్‌ వ్యాఖ్యలు తమనుద్దేశించి చేసినవేనని ప్రచారం జరగడంతో కపిల్ సిబల్ సోషల్ మీడియా వేదికగా బదులిచ్చారు. 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన తాను బీజేపీ తొత్తులా కనిపిస్తున్నానా అంటూ సిబల్ మండిపడ్డారు. అలాగే.. తాను బీజేపీ ఏజెంట్‌నని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆజాద్ కూడా ఘాటుగా బ‌దులిచ్చిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఇక‌.. ఈ విష‌య‌మై ఇద్దరు సీనియ‌ర్‌ నేతలూ మళ్లీ సోషల్ మీడియాలో స్పందించారు. రాహుల్ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు తననుద్దేశించి చేసినవి కాదని.. తాను ముందు చేసిన ట్వీట్లను డిలీట్ చేస్తున్నానని ప్రకటించిన క‌పిల్ వాటిని తొలగించేశారు. ఇక మ‌రో సీనియ‌ర్ నేత‌ ఆజాద్ కూడా రాహుల్ వ్యాఖ్యలు తమనుద్దేశించి చేసినవి కావని.. ఓ వ‌ర్గం మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.

Next Story