పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశమైన వనాటులో స్థిరపడాలని కలలు కంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి అక్కడి ప్రభుత్వం నుంచి పెద్ద దెబ్బ తగిలింది. లలిత్ మోదీకి జారీ చేసిన వనాటు పాస్పోర్ట్ను రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్ను వనాటు ప్రధాని జోథమ్ నాపట్ ఆదేశించారు.
ఇటీవల లలిత్ మోదీ తన భారత పాస్పోర్ట్ను అప్పగించాలని లండన్లోని భారత హైకమిషన్కు దరఖాస్తు చేసుకున్నాడు. లలిత్ మోదీ 2010లో భారత్ వదిలి లండన్లో స్థిరపడ్డారు. శుక్రవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA).. లలిత్ మోదీ తన భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి దరఖాస్తు చేసుకున్నట్లు ధృవీకరించింది.
ఇదిలావుంటే.. లలిత్ మోదీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్తో బ్రేకప్ మూడ్ నుంచి బయటపడి ఇటీవల ఓ అందమైన మహిళపై మనసు పారేసుకున్నాడు. 61 ఏళ్ల వయసులో లలిత్ మోదీ మళ్లీ ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున లలిత్ మోదీ మరోసారి తాను క్లీన్ బౌల్డ్ అయ్యానని ప్రకటించారు. లలిత్ మోదీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. తన కొత్త భాగస్వామి గురించి చెప్పారు. ఎట్టకేలకు తన 25 ఏళ్ల స్నేహానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నానని లలిత్ మోదీ చెప్పారు. అయితే లలిత్ మోదీ తన భాగస్వామి ఎవరనే విషయాన్ని దాచిపెట్టారు.