'ఆ భయంకరమైన బాంబు శబ్దాన్ని స్వయంగా విన్నా.. నా ఇల్లు వణికిపోయింది' : ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు
ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా ఖండించారు.
By - Medi Samrat |
ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్తో హేతుబద్ధమైన, నాగరిక సంబంధాలను కొనసాగించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమైందని కర్జాయ్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన అభివర్ణించారు.
స్కై న్యూస్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్.. ఆ బాంబు దాడి యొక్క భయంకరమైన శబ్దాన్ని తాను స్వయంగా విన్నానని చెప్పారు. నా ఇల్లు వణికిపోయింది.. చుట్టుపక్కల ప్రాంతమంతా పొగ, దుమ్ముతో నిండిపోయింది. ఇరు దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఆయన అభివర్ణించారు.
ఆఫ్ఘనిస్తాన్లోని రాచరిక, గణతంత్ర లేదా ప్రస్తుత తాలిబన్ పాలన అయినా సరే, ఏ ప్రభుత్వంతోనూ పాకిస్తాన్ ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగించలేకపోయిందని కర్జాయ్ అన్నారు. తన పదవీకాలంలో సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా తాను 20 సార్లు పాకిస్తాన్ను సందర్శించినట్లు ఆయన తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్లో గందరగోళం, బలహీనత, అణచివేత సృష్టించడం ద్వారా పాకిస్తాన్ తన స్వప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ ప్రభుత్వానికి హేతుబద్ధమైన, న్యాయమైన, నాగరిక సంబంధాలు వద్దని కర్జాయ్ అన్నారు. ఇది చాలా తప్పు. వారు తమ మనసు మార్చుకుని, ఆఫ్ఘనిస్తాన్తో స్థిరమైన, నాగరిక సంబంధాలను కోరుకుంటారని నేను ఆశిస్తున్నానన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద లక్ష్యాలుగా భావిస్తున్న వాటిపై పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఫిబ్రవరి చివరిలో ఈ సంఘర్షణ మొదలైంది. ఆ తర్వాత ఇటీవల ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రిపై ఈ వారం జరిగిన క్షిపణి దాడిలో 400 మందికి పైగా మరణించడం, సుమారు 250 మంది గాయపడటంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చిందని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతింది. ఆఫ్ఘనిస్తాన్ దీనిని ఒక పౌర సదుపాయంపై జరిగిన దాడిగా అభివర్ణించగా, పాకిస్తాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము ఏ ఆసుపత్రిని గానీ, పౌర ప్రాంతాన్ని గానీ లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఒక ఉగ్రవాద స్థావరాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. సరిహద్దు ఉగ్రవాదానికి ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇస్తోందని కూడా పాకిస్తాన్ ఆరోపించింది.