చైనాకు షాక్ ఇచ్చేలా భారత రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపాల్

Nepal green lights India rail project. భారత్-నేపాల్ మధ్య అనుబంధం మరింత దృఢపడనుంది. చైనా రైల్వేస్ నేపాల్ లోకి రాకుండా

By Medi Samrat  Published on  11 Dec 2020 4:02 AM GMT
చైనాకు షాక్ ఇచ్చేలా భారత రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపాల్

భారత్-నేపాల్ మధ్య అనుబంధం మరింత దృఢపడనుంది. చైనా రైల్వేస్ నేపాల్ లోకి రాకుండా ముందస్తు ప్రణాళికలు వేసిన భారత ప్రభుత్వం నేపాల్ తో రైల్వే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్దినెలల కింద భారత్ తో నేపాల్ కొన్ని విషయాల్లో విబేధించిన సంగతి తెలిసిందే.. కొన్ని దశాబ్దాల పాటూ భారత్ తో సత్సంబంధాలు కలిగిన నేపాల్ ఇటీవల మ్యాపుల్లో భారత్ కు చెందిన ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చెప్పుకుంది. అయోధ్య గురించి కూడా నేపాల్ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. మరో వైపు భారత్ నేపాల్ తో సంబంధాల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. భారత్ కు చెందిన ఉన్నతాధికారులు నేపాల్ లో పర్యటించి సత్సంబంధాలు మెరుగుపడడానికి కృషి చేశారు.

అక్టోబర్ నెలలో భారత స్పై ఛీఫ్ సమంత్ గోయల్ ఖాట్మండుకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు. భారత ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే, ఫారెన్ సెక్రెటరీ హర్ష్ వర్ధన్ కూడా ఖాట్మండు పర్యటనకు వెళ్లారు. పలు విషయాలపై చర్చించారు. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యవాలీ ఢిల్లీ పర్యటనకు రానున్నారు. భారత్-నేపాల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం ఆయన రాబోతున్నారు.

తాజాగా నేపాల్ అధికారులు భారత్ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ కు చెందిన కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు సమ్మతం తెలిపింది. ఇందులో భాగంగా నేపాల్ రాజధాని ఖాట్మండును రక్సుల్ నగరంతో కనెక్ట్ చేసే అవకాశం ఉంది. బోర్డర్ లో ఉన్న భారత పట్టణమైన రక్సుల్ నుండి నేపాల్ కు రైల్వే లైన్ వేయడం విశేష అంశం. రక్సుల్ ను 'నేపాల్ గేట్ వే టు ఇండియా' అని అంటారు. ఢిల్లీ నుండి కోల్ కతా.. అక్కడి నుండి రక్సుల్ పట్టణం.. ఆ తర్వాత ఖాట్మండుకు రైల్వే లైన్ ఉండనుంది. ఇది భారత్ కు ఎంతో కీలకం కానుంది. భారత ప్రభుత్వానికి ఆగస్టు నెలలో అనుమతి లభించిందని నేపాల్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రైల్వే లైన్ పొడవు 136 కిలోమీటర్లు కాగా.. 42 కిలోమీటర్లు దాదాపు సొరంగ మార్గం గుండా ప్రయాణం ఉంటుంది. మూడు ట్రిలియన్ల నేపాలీ రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనాకు భారత్ చెక్ పెట్టనుంది.


Next Story