అమెరికాలో కోడలిని వెంటాడి కాల్చి చంపిన మామ‌

Indian-American Man Kills Daughter-In-Law At Walmart Parking Lot. 74 ఏళ్ల భారతీయ-అమెరికన్ వ్యక్తి అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్టయ్యాడు.

By Medi Samrat  Published on  7 Oct 2022 9:20 AM GMT
అమెరికాలో కోడలిని వెంటాడి కాల్చి చంపిన మామ‌

74 ఏళ్ల భారతీయ-అమెరికన్ వ్యక్తి అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్టయ్యాడు. తన కొడుకుకు కోడలు విడాకులు ఇవ్వబోతోందనే కోపంతో పార్కింగ్ స్థలంలో ఆమెను కాల్చి చంపాడు. సీతాల్ సింగ్ దోసాంజ్ తన కోడలు గుర్‌ప్రీత్ కౌర్ దోసాంజ్‌ను కాల్చి చంపేశాడు. ఆమె పనిచేస్తున్న వాల్‌మార్ట్‌లోని సౌత్ శాన్ జోస్ పార్కింగ్ స్థలంలో గత వారం హత్య చేసినట్లు ఈస్ట్ బే టైమ్స్ నివేదించింది.

సీతాల్ సింగ్ దోసాంజ్ అరెస్టుకు దారితీసిన వివరాలను కూడా పోలీసులు పంచుకున్నారు. బాధితురాలు శుక్రవారం ఫోన్‌లో సీతాల్ సింగ్ దోసాంజ్ తన కోసం వెతుకుతున్నాడని, ఏమైనా చేస్తాడేమోనని భయపడుతూ ఉన్నట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పిందని తేలింది. సీతాల్ సింగ్ దోసాంజ్ కోడలిని వెతకడానికి 150 మైళ్లు ప్రయాణించాడని తెలుస్తోంది. గుర్‌ప్రీత్ కౌర్ వాల్‌మార్ట్ సహోద్యోగి ఆమె రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. ఆమెను రెండు సార్లు కాల్చినట్లు గుర్తించారు. ఆమె అక్కడికక్కడే చనిపోయిందని నివేదిక పేర్కొంది.

ఫ్రెస్నోలోని ఇంట్లో సీతాల్‌ను అరెస్టు చేశారు. శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం బుధవారం దాఖలు చేసిన హత్య అభియోగంతో పాటుగా పోలీసు పరిశోధనలో అతడి నివాసంలో పోలీసులు .22-క్యాలిబర్ బెరెట్టా పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీతాల్‌ను శాన్ జోస్‌లోని ప్రధాన జైలుకు తరలించారు. నవంబర్ 14న కోర్టుకు తిరిగి రావాలని ఆదేశించారు.


Next Story