భారత్కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ తన గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు వెళ్లింది. అమెరికా ఆంక్షలు విధించిన ఈ నౌక, షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం భారత్కు కాకుండా చైనాకు మళ్లింది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్ పొందాల్సిన మొదటి ఇరాన్ చమురు దిగుమతిపై అనిశ్చితి నెలకొంది.
2002లో నిర్మించిన 'పింగ్ షున్' అనే ఆఫ్రామాక్స్ నౌకపై 2025లో అమెరికా ఆంక్షలు విధించింది. ఇందులో 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉంది. ఈ వారం ప్రారంభంలో ఈ ట్యాంకర్ గుజరాత్లోని వాడినార్ రేవుకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. అయితే, వాడినార్ చేరుకోవడానికి మూడు రోజుల ముందు, గమ్యస్థానాన్ని చైనాలోని 'డోంగ్యింగ్' కు మార్చుకుంది. చెల్లింపులకు సంబంధించిన సమస్యల వల్లే ఈ మార్పు జరిగినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఇచ్చే 30-60 రోజుల క్రెడిట్ గడువును తగ్గించి, విక్రేతలు ఇప్పుడు ముందస్తు చెల్లింపులు కోరుతున్నట్లు సమాచారం. 2019లో అమెరికా ఆంక్షల వల్ల భారత్ ఇరాన్ నుండి చమురు దిగుమతులను నిలిపివేసింది. ఇటీవల అమెరికా ఇచ్చిన స్వల్పకాలిక మినహాయింపుతో మళ్ళీ దిగుమతులు ప్రారంభమవుతాయని భావించారు, కానీ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.