కాబూల్ లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు దుర్మరణం

6 Killed In Kabul Suicide Blast Near Foreign Ministry. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది.

By Medi Samrat  Published on  27 March 2023 1:12 PM GMT
కాబూల్ లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు దుర్మరణం

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భారీ పేలుడు కారణంగా ఆరుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు, పలువురు గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆప్ఘన్ విదేశాంగ కార్యాలయానికి సమీపంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మాహుతి బాంబర్ తన లక్ష్యం వైపు దూసుకువెళ్లుండగా మాలిక్ అష్ఘుర్ స్క్వేర్ వద్ద అతన్ని కాల్చిచంపామని, ఇదే సమయంలో అతను తనను తాను పేల్చేసుకున్నాడని కాబూల్ పోలీస్ ప్రతినిధి ఖలిద్ జడ్రాన్ తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు తాలిబన్ భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడినట్టు చెప్పారు. చెక్‌పాయింట్ సమీపంలో విదేశాంగ శాఖ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ భవంతులు ఉన్నాయి. అవే ఆత్మాహుతి బాంబర్ టార్గెట్ కావచ్చని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ప్రకటించ లేదు.

కాబూల్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆఫీసు సమీపంలో మూడు నెలల్లోపు జరిగిన రెండవ దాడి. ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైన తర్వాత ఈ దాడి మొదటిది.


Next Story