రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్‌లోని మాధాపూర్‌ హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు చేరువ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌ను గురువారం నిర్వ‌హించింది.

By -  Medi Samrat
Published on : 12 Feb 2026 6:32 PM IST

రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్‌లోని మాధాపూర్‌ హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు చేరువ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌ను గురువారం నిర్వ‌హించింది. వంద‌లాది తాత్కాలిక షెడ్డుల‌ను, ప‌దుల సంఖ్య‌లో ఉన్న షాపుల‌ను తొల‌గించింది. మొండి కుంట ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 2200 ల కోట్ల ప్ర‌భుత్వ ఆస్తిని హైడ్రా ర‌క్షించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ గ్రామంలో గురువారం ఈ మేజ‌ర్ ఆప‌రేష‌న్ హైడ్రా చేసింది. స‌ర్వే నంబ‌రు 53లోని మొండికుంట‌తో పాటు.. స‌ర్వే నంబ‌రు 55లోని ప్ర‌భుత్వ భూమి ఎక‌రాల‌కొద్దీ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ఏ వీ రంగ‌నాథ్ ఆదేశాల‌మేర‌కు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌లిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎక‌రాలు క‌బ్జాకు గురైన‌ట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆల‌యాన్ని హ‌ద్దుగా చూపించి క‌బ్జాదారులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు అధికారులు నిర్ధారించారు. ఆల‌యం హ‌ద్దుగా ప‌లు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐర‌న్ స్టీల్ షాపు ఇలా ప‌లు ర‌కాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తున్న‌ట్టు గుర్తించారు. 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెల‌కు రూ. ల‌క్ష‌ల్లో అద్దెలు వ‌సూలు చేస్తున్నారు.

మొండికుంట‌తో పాటు.. అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌పై జ‌న‌వ‌రి 31న హైడ్రా విచార‌ణ కూడా చేప‌ట్టింది. రెవెన్యూ అధికారుల‌తో పాటు.. క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు కూడా ఈ స‌మ‌వేశంలో పాల్గొన్నారు. వారి స‌మ‌క్షంలోనే ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్టు రెవెన్యూ అధికారులు స్ప‌ష్టం చేశారు. అలాగే ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ చిత్రాల‌ను ప‌రిశీలించి కూడా ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్టు నిర్ధారించారు. ఇదే విష‌యాన్ని క‌బ్జాదారుల‌కు తెలియ‌జేశారు. వారికి కొంత స‌మ‌యాన్ని ఇచ్చి గురువారం హైడ్రా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిని చేప‌ట్టింది. వంద‌ల సంఖ్య‌లో ఉన్న తాత్కాలిక షెడ్డుల‌ను భారీ బందోబ‌స్తు మ‌ధ్య హైడ్రా తొల‌గించింది. ఈ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన సంద‌ర్భంలో అక్క‌డ స్థానికులు పెద్ద మొత్తంలో వ‌చ్చి హైడ్రా చ‌ర్య‌ల‌ను అభినందించారు. మొండికుంట చెరువును కాపాడినందుకు అక్క‌డ స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ భూమిలో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన చోట పార్కుల‌ను అభివృద్ధి చేయాల‌ని స్థానికులు ఈ సంద‌ర్భంగా హైడ్రా అధికారుల‌ను కోరారు. అలాగే చెరువును కూడా అభివృద్ధి చేసి సుంద‌రీక‌రించాల‌ని అభ్య‌ర్థించారు.

Next Story