పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

MGBS-ఫలక్‌నుమా మధ్య పాతబస్తీ మెట్రో మార్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు

By Medi Samrat  Published on  8 March 2024 3:17 PM GMT
పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

MGBS-ఫలక్‌నుమా మధ్య పాతబస్తీ మెట్రో మార్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నామ‌న్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే మా దృష్టి.. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అని పేర్కొన్నారు.

ఒరిజినల్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మేం కృషి చేస్తున్నామ‌న్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామ‌ని.. ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్ తో కలిసి సందర్శించామ‌ని వెల్ల‌డించారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్-2 ను తీసుకొస్తున్నామ‌ని తెలిపారు. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకూ మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నామ‌ని వెల్ల‌డించారు.

చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ను ఏర్పాటు చేయబోతున్నామ‌ని తెలిపారు. చంచల్ గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తామ‌ని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలోప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మాది.. మైనారిటీల కోసం 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ద‌న్నారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం.. హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామ‌న్నారు. గండిపేట నుంచి నగరంలోని 55 కి.మీ ల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు.

Next Story