హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వైపు నుంచి వస్తున్న వరద హుసేన్ సాగర్ కు చేరుకుంటున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా, ఈరోజు మధ్యాహ్నం నీటిమట్టం 513.63 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం సాగర్ కు 1,234 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లో 1,523 క్యూసెక్కులుగా ఉంది. నీటిని దిగువకు వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఇవాళ మరింతగా బలపడటంతో హైదరాబాద్ మహానగంలో రానున్న రెండు గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.