డ్రగ్స్ నేరగాళ్లపై రౌడీషీటర్ల తరహా నిఘా
సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని ఏరిపారేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు.
By - Medi Samrat |
సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని ఏరిపారేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై ఎటువంటి నిఘా ఉంచుతామో.. డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపైనా అదే స్థాయి నిఘా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో శుక్రవారం నగర సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీకి ఐబీ, డీఆర్ఐ, ఎన్సీబీ, ఎక్సైజ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, ఎఫ్ఆర్ఆర్వో తదితర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల అధికారులు హాజరయ్యారు.
నగరంలో మాదకద్రవ్యాల నెట్వర్క్కు చెక్ పెట్టేందుకు 'హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్' (హెచ్-న్యూ)ను మరింత బలోపేతం చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న బృందాలకు అదనంగా మరో నాలుగైదు కొత్త బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, నిందితుల అరెస్టుల్లో ఈ బృందాలు కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్కరోజుతో ముగిసే ప్రక్రియ కాదని, అది నిరంతర పోరాటమని సీపీ పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ఇకపై ప్రతినెలా అన్ని ఏజెన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, కేసుల పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
పాత కేసులు, నిందితుల కదలికలు, కొత్త నేర పద్ధతులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
డ్రగ్స్ రవాణా, వినియోగంలో విదేశీయుల పాత్రపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల సమాచారం ఆధారంగా సంబంధిత ఏజెన్సీస్ నిరంతరం సమన్వయం చేసుకుంటూ అనుమానితుల కదలికలపై నిఘా పెట్టడంపై చర్చించారు.
అలాగే, డ్రగ్స్ రవాణాకు కొరియర్ సర్వీసులు వేదికగా మారుతున్న నేపథ్యంలో వాటిపైనా ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. వైద్యం కోసం నగరానికి వచ్చి, ఆసుపత్రుల్లో చేరకుండా తిరుగుతున్న విదేశీయుల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఇలాంటి వారి వివరాలను డీఆర్ఐ, ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులతో పంచుకుని వారిని వెంటనే ట్రాక్ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.