సబ్బం హరికి జీవిఎంసీ షాక్ : టీడీపీ సీరియస్
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Oct 2020 1:55 PM ISTవిశాఖపట్నం : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవిఎంసీ) అధికారులు.. టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి సీతమ్మధారలోని ఇంటి వద్ద అక్రమంగా నిర్మించిన టాయిలెట్ ను శనివారం కూల్చివేశారు. ఈ మేరకు సబ్బం హరి 12 అడుగుల భూమిని ఆక్రమించి, అక్కడ టాయిలెట్ నిర్మించినట్లు జీవిఎంసీ తెలిపింది.
శనివారం తెల్లవారుజామున జీవీఎంసీ అధికారి సిబ్బందితో పాటు సబ్బం హరి నివాసానికి చేరుకుని మరుగుదొడ్డి భాగాన్ని కూల్చివేశారు. అంతకుముందు జీవిఎంసీ నోటీసులు జారీచేసిన సబ్బం హరి ఆ ఆక్రమ నిర్మాణాన్ని తొలగించలేదని జీవిఎంసీ అధికారులు పేర్కొన్నారు.
అయితే, తాను భూమిని ఆక్రమించలేదని, జీవీఎంసీ నుండి తనకు ఎటువంటి నోటీసు రాలేదని సబ్బం హరి అంటున్నారు. విశాఖ ప్రాంతంలోని సీనియర్ రాజకీయ నాయకులలో సబ్బం హరి ఒకరు. ఆయన పలు న్యూస్ ఛానెళ్లలో నిర్వహించే రాజకీయ చర్చలలో పాల్గొని ఆధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తారు.
ఈ విషయమై టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల్లో ఇదో భాగమని ట్వీట్ చేశారు. సామాన్యుడి పక్షాన మాట్లాడే ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే.. మూములు వారి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు.