థియేటర్ల బంద్ అంశంపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మల్టీఫ్లెక్స్ మాదిరే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని కోరారు. కొందరు అసలు విషయాన్ని దాటేసి ఇదంతా హరి హర వీరమల్లు సినిమాకు నష్టం చేసేందుకు కుట్ర అంటూ తెరపైకి తీసుకురావడం చాలా దుర్మార్గమని అన్నారు.
సింగిల్ థియేటర్స్ మనుగడ కోసమే వారు బంద్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని, చాలా ఏళ్ల క్రితమే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ సిస్టమ్ ఉండాలని చాలా ఏళ్ల కిందటే కోరుకున్నానని తెలిపారు. పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉందని, కానీ, హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దమన్నారు. పర్సంటేజీ సిస్టమ్ అన్ని థియేటర్స్కు లేకపోవడం వల్ల నిర్మాతలు అందరూ నాశనం అయిపోతున్నారన్నారు. బంద్ అనేది బ్రహ్మాస్తం లాంటిది. సింగిల్ థియేటర్ల మనుగడ నేడు ప్రశ్నార్థకరమైందని, భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే వినోదమన్నారు నారాయణ మూర్తి. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదన్నారు.